Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts

Friday, December 15, 2017

దేముడికీ చావొస్తుంది!! (కథ)

సత్తిరాజు ఆఊర్లో ఒక మంచి జులాయి. మంచి జులాయి అంటే నిజంగా మంచి తెలివయిన జులాయి అన్నమాట. అల్లరి తిరుగుళ్ళూ, చిల్లర దొంగతనాలే కాదు తెలివిగా జనాలను ఎలా మోసం చెయ్యాలో బాగా తెలిసిన వాడు. ఊర్లో సత్తిరాజంటే తెలియనివారూ, సత్తిరాజును తిట్టని వారూ ఎవరూ ఉండరేమో. ఒకరోజు సంతలో ఆండాళ్ళమ్మ చెయ్యి పట్టుకున్నందుకు అక్కడి జనం చక్కగా వడ్డించడమే కాదు, మళ్ళీ ఊర్లో కనిపిస్తే మక్కెలిరుగుతాయని వార్నింగు కూడా ఇచ్చారు.

సత్తిరాజుకు అహం దెబ్బతిన్నది. ఛ!ఎందుకీబతుకు అనుకున్నాడు. ఊరోళ్ళమీద బాగ కసి పుట్టింది. అసలీ ఊళ్ళోనే ఉండొద్దు అనుకున్నాడు. కానీ ఎక్కడికని వెల్లగలడు? ఊరిబయట చింతతోపులో అలా ఒంటరిగా నడుస్తున్నాడు. ఆలోచిస్తున్*నాడు. ఏమిటి చెయ్యాలి? తనను కొట్టిన ఈఊరివారిపై ఎలా కసి తీర్చుకోవాలి అని తెగ బుర్రగోక్కున్నాడు. సరే కొద్దిరోజులు పట్నం వెల్లి గడిపి అంతా సద్దుమణిగినతరువాత మల్లీ ఊరికి రావచ్చని పట్నం బస్సెక్కాడు.

ఫట్నంలో అలా ఒంటరిగా నడుస్తూ ఉంటే కాషాయం బట్టలు తొడుక్కుని గడ్డం పెంచుకుని, గంజాయి పీలుస్తూ గుడిపక్కన కూర్చున్న ఒక జంగమయ్య కనిపించాడు. జంగమయ్యను చూడగానే సత్తిరాజు బుర్రలో తళుక్కున ఒక ఐడియా మెరిసింది. ఔను, తానొక స్వామీజీ అవతారమెత్తి ఊరికెల్తే? ఊరివాల్లు నమ్ముతారా? తనను కొట్టినవారు ఇప్పుడు తనమాట వింటారా? ఏమయితే అదయింది, ఇంకా ఎన్నాల్లీ చిల్లర దొంగతనాలు, జీవితంలో ఏదో ఒకటి గట్టిగా చేసెయ్యాలనే మొండి ధైర్యం వచ్చింది. జేబులో ఉన్న ఐదొందల నోటుతో మార్కెటుకెల్లి ఒక కాషాయం రంగు తాను గుడ్డా, ఉంగరాలజుత్తుండే విగ్గూ కొనుక్కొచ్చాడు. దారిన కనపడ్డ టైలరు దగ్గర కాషాయం గుడ్డతో రెండు నైటీ టైపు గౌనులు కుట్టించుకున్నాడు. బూక్‌స్టాల్ కెల్లి తెలుగులో కనపడ్డ రెండు భక్తి పుస్తకాలు, తత్వాలు కొన్నాడు. ఒక నెలరోజులు అలాగే పట్నంలో ఉండి పుస్తకాల్లో దొరికిన తత్వం ముక్కలు బట్టి వేశాడు. 

నెలరోజుల తరువాత ఒకరోజు రాత్రి సత్తిరాజు తిరిగి ఊరికెల్లాడు. చీకట్లోనే తనకు తెలిసిన ఇద్దరు చిల్లర దొంగలను కలుసుకుని తన ప్లాను చెప్పాడు. తెల్లవారగానే ఒక చెట్టుకింద కూర్చుని ఇద్దరు దొంగలనీ శిష్యులుగా చేసుకుని తత్వం మాట్లాడం మొదలుపెట్టాడు. ఆనోటా ఈనోటా ఊరిజనానికి అందరికీ సత్తిరాజు కొత్తావతారం గురించి తెలిసింది. మొదట నవ్వుకున్నారు, తరువాత సరేలే పోనిమ్మనుకున్నారు, మెల్లిగా ఏమో ఏ పుట్టలో ఏపాముందో? ఎక్కడికెల్లి ఏమహిమలు నేర్చుకున్నాడో అనుకున్నారు. మెల్లిమెల్లిగా సత్తిరాజు చింతచెట్టుకు జనం రాకపోకలు పెరిగిపొయ్యాయి. అన్నట్టు మరో విషయం! పట్నంలో ఉండగా ఒక గారడీవాడు రోడ్డుమీద ఆడుతుంటే సత్తిరాజు గంటలతరబడి చూసి కొన్ని చిన్నచిన్న విద్యలు నేర్చుకున్నాడు. ఇంతకుముందు జేబుదొంగతనాలు చేసే అనుభవం ఉండడంతో నేర్చుకోవడం పెద్ద కష్టం కాలేదు. ఇప్పుడు ఆ గారడీ బాగ కలిసొచ్చింది. చెట్టుదగ్గరికి వచ్చిన ఊరివారిని ఆకర్షించదంకోసం గారడీలు చెయ్యడం మొదలు పెట్టాడు. ఆండాళ్ళమ్మ విషయంలో తన ప్రేమ బెడిసికొట్టడం బాగ పనిచేసిందేమో, వచ్చినవారికి ప్రేమే దైవం అంటూ తత్వం చెప్పేవాడు.

ఇప్పుడు సత్తిరాజు వట్టి సత్తిరాజు కాదు, సత్యానందస్వామి. ఆనోటా ఈనోటా చుట్టుపక్కల ఉన్న ఊరివారందరికీ తెలిసిపొయ్యాడు. చింతచెట్టు చుట్టూ ఒక చిన్న ఆశ్రమం కట్టారు. జనాల రాకపోకలు పెరిగాయి. వచ్చినవారో అంతో ఇంతో డబ్బులు ఇచ్చేవారు, లేకపోతే ఏదయిన వస్తువు ఇచ్చేవారు. ఇప్పుడు సత్తిరాజుకూ, శిష్యులకూ రోజులూ బాగా గడుస్తున్నాయి. ఆశ్రమంలో కొంతమంది పెర్మనెంట్ భక్తులు ఏర్పడ్డారు. ఒకరోజు శివరాత్రినాడు మంచి టైం చూసుకుని సత్తిరాజు భక్తులకు తాను దేవున్ననీ, ఫలానా అవతారమనీ చెప్పుకున్నాడు. భక్తులు నిజమే కాబోలనుకున్నారు. దేవుడికి అతిదగ్గరి భక్తబృందంలో తామున్నందుకు మురిసిపొయ్యారు, తమవంతు ప్రచారం చేశారు. చూస్తుండగానే సత్యస్వామికి రాష్ట్రం మొత్తంలో భక్తులు పెరిగిపొయ్యారు.
(ఇంకాఉంది)

ఇద్దరన్నదమ్ముల కథ

అనగనగా ఒక ఊర్లో ఇద్దరన్నదమ్ములు. అన్న ఏపని చేసేవాడు కాదు. ఉట్టినే బలాదూరుగా తిరగడం వల్ల ఊర్లో మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు. తమ్ముడు అదో ఇదో పనిచేసి సంపాదిస్తే వచ్చిన డబ్బుతో కుటుంబం గడిచేది. సంపాదించేది తమ్ముడయినా పెద్దవాల్లు కాబట్టి ఇంట్లో అన్నా, అన్న భార్యల పెత్తనమే సాగేది.గంపెడు చాకిరీ చేస్తే తమ్ముడి భార్యకు తినడానికి కడుపునిండా భోజనం కూడా దొరికేది కాదు. 

తమ్ముడి పెల్లయినప్పుడు తమ్ముడి భార్యకు అరణంగా పుట్టింటివారు ఒక ఆవును ఇచ్చారు. కాలం గడుస్తున్నకొద్దీ ఆవు పెద్దదయి బాగానే పాలిస్తుంది. అయితే పాలన్నీ అన్న పిల్లలే తాగేవారు. తమ్ముడి పిల్లలకు పాలూ, పెరుగు దొరికేవి కావు. ఇంట్లో ఒక దానిమ్మ చెట్టుండేది. ఆ దానిమ్మ పల్లు కూడా అన్ని అన్న పిల్లలే తినేవారు. కాలం గడుస్తున్నకొద్దీ సరైన ఆహారం దొరక్క తమ్ముడు, తమ్ముడి భార్యా పిల్లలూ బక్కచిక్కిపొయ్యారు. దాంతో వీరికంటే బలంగా తయారయిన అన్న పిల్లలు ఇంకాస్త దౌర్జన్యం చేసే వారు, తమ్ముడి పిల్లలను గేలిచేసేవారు.


కొన్నాల్లకు వల్లుమండిన తమ్ముడి భార్య  భర్తతో మనం దోపిడీకి గురవుతున్నాం, ఇలాగయితే కష్టం, ఉమ్మడి కుటుంబంలో తమకు ఇబ్బందిగా ఉంది, విడిపోదామని తెగేసి చెప్పింది. ఊర్లో పెద్దమనుషుల పంచాయితీ పెట్టి ఇలా నామొగుడు పనిచేసి సంపాదిస్తున్నా మాకు సరిగ్గా తిండి కూడా దొరకట్లేదు, అందుకే విడిపోవాలనుకుంటున్నామని చెప్పింది.


అప్పటిదాకా తమ్ముడి సంపాదనతో ఏ పనిచెయ్యకుండానే చక్కగా తింటున్న అన్నకుటుంబానికి ఈపరిణామం ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. అమ్మో విడిపోతే రేపటినుంచి తాను ఏం చేసి కుటుంబాన్ని పోషించాలి అని అన్న అనుకున్నాడు. అమ్మో ఇప్పుడు ఉన్నపళంగా విడిపోతే నాఇంటిపనీ, వంటపనీ నేనే చేసుకోవాలి ఎలాగా అని అన్న  భార్య అనుకుంది. అమ్మో ఇప్పుడు చక్కగా ఆవు పాలూ, పెరుగు తాగుతున్నాం, విడిపోతే ఈ ఆవు మనకు దక్కదు అని అన్న పిల్లలనుకున్నారు. అంతా కలిసి ఎలాగయినా తమ్ముడి కుటుంబం విడిపోకుండా అడ్డుకోవాలనుకుని తామూ విడిపోడానికి వీల్లేదంటూ పద్దమనుషులదగ్గర ఎదురు పంచాయితీ పెట్టారు. ఇక పంచాయితీ మొదలయింది.


అదేంటి, మేం విడిపోవడానికి వీల్లేదంటూ చెప్పే హక్కు మీకెక్కడుంది? కలిసుండాలా విడిపోవాలా అని నిర్ణయించుకునే హక్కు మాకుంది. మేం విడిపోతామంటే సొమ్ములు ఎలా పంచుకోవాలనే విషయంపై పంచాయితీ పెట్టాలి గానీ విడిపోవాడానికి వీల్లేదంటూ పంచాయితే పెడితే ఎలా అంటూ తమ్ముడు నోరుబాదుకున్నాడు. మనది ఒకే వంశం, ముందు నుండీ కలిసే ఉన్నాం, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇదంతా ఆపక్కింటి ఎల్లయ్యగాడి కుట్రగని లేకపోతే విడిపోవాలనే పాడు బుద్ది నీకెలా వస్తుంది? అంటూ అన్న ఎదురు ప్రశ్న వేశాడు.


"చూడు తిండిసరిగా దొరక్క నాడొక్క ఎలా ఎండిపోయిందో? ఇన్నాల్లూ నాసంపాదన మీరు దోచుకున్నారు, ఇక మీతో కలిసి ఉండడం నాకు సాధ్యం కాదు" అంటూ వల్లుమండిన తమ్ముడు చెప్పాడు. అమ్మో అమ్మో మీ సంపాదన మేం దోచుకున్నామా? మమ్మ్మల్ని దోపిడీ దొంగలంటావా? ఇల్లాగయితే నిన్నస్సలు విడిపోనివ్వం అంటూ అన్న భార్య హుంకరించింది.


నీడొక్క ఎండిపోతే దానికి మేమెలా భాద్యులం? నీసమస్యకు మమ్మల్ని కారణమంటావేం అంటూ అన్న లాజిక్ పెట్టాడు. నాసమస్యకు కారణం నువ్వనడం లేదు, అసలు నాసమస్యే నువ్వు అందుకే విడిపోతున్నాం. తమ్ముడు బుర్ర గొక్కుంటూ సనిగాడు.


మమ్మల్ని దోచుకున్నామని నువ్వు, నీభార్యా ఫలానా రోజు పెద్దమనుషుల దగ్గర అన్నారు, మీరు లెక్కలు తీసుకొచ్చి మేము మిమ్మల్ని నిజంగానే దోచుకున్నట్టు నిరూపిస్తేగానీ విడిపోవడానికి వీల్లేదు. మమ్మల్ని ఈసంఘం దృష్టిలో దోపిడీదారులను చేద్దామనా నీ ఐడియా? అన్న భార్య హుంకరించింది. ఇంట్లో లెక్కలు రాసేదీ, సామాన్లూ కొనుక్కొచ్చేదీ అన్నీ అన్నే చేస్తాడు కాబట్టి అన్న ముందే లెక్కల పద్దు తనకు అనుకూలంగా రాసుకున్నాడు. తమ్ముడు లెక్కలు చెప్పబోతే అవి చెల్లవు, నేను  రాసిన ఈ మన ఉమ్మడికుటుంబం అధికారిక పద్దులు చూపిస్తేనే నేను ఒప్పుకుంటా, వేరే లెక్కలు నేనొప్పుకోను అంటూ అన్న తెలివి ప్రదర్శించాడు.


అసలు కలిసి ఉండాలనేభావన ఒక ఉమ్మడి కుటుంబంలోని విలువ, దాన్నీ ఇద్దరూ గౌరవించి ఎవరికీ అన్యాయం జరగకుండా ఉంటే బాగానే ఉంటుంది, అలా కుదరనప్పుడు విడిపోవడం నాహక్కు దానికి అసలు ఏలెక్కలు మాత్రం ఎందుకు? లేని హక్కు కోసం నువ్వెలా పంచాయితీ పెడతావు? తమ్ముడు వాపోయాడు.


నువ్వు విడిపోతామనేది మీకు అరణంగా మీపుట్టింటివారిచ్చిన ఆవు ఉంది కనుకే. ఆఅవు ఇప్పుడు మన ఉమ్మడి పెరట్లో గడ్డితిని బలిసింది కనుక అది ఉమ్మడి ఆస్థి, దాన్ని నువ్వొక్కడివే కొట్టేద్దామని చూస్తున్నావ్! అన్న తెలివి ప్రదర్శించాడు. అయ్యో అది నాకు మాపుట్టింటివారిచ్చిన ఆవు, ఇన్నాల్లూ మీరే మా ఆవు పాలు తాగారు, విడిపోతే నాఅవు నాకుదక్కాలనుకోవడం కూడా తప్పేనా అనుకుంది తమ్ముడి భార్య.


ఇదీ కథ! మాఇంట్లో జరిగిన కథ, రాష్ట్రంలో జరుగుతున్న కథ. ముగింపు ఎలాగుంటుందనేది కాలమే నిర్ణయించాలి.
(on 20 Oct 2011)

రూంమేట్లు!!

"రమేశ్, నువ్వు గదిఖాలీ చేయడానికి వీల్లేదంతే!" గదమాయించి మరీ చెప్పాడు సుబ్బారావ్.

సుబ్బారావు, రమేశ్ ఇద్దరూ బ్యాచిలర్లు. చెరో ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఒకే అపార్ట్‌మెంటులో కలిసి అద్దెకు ఉంటున్నారు. మొదట్లో ఇద్దరూ బాగానే ఉన్నారు. కాలం గడిచే కొద్దీ సుబ్బారావు పెద్దరికం మరీ ఎక్కువయిపోయింది.


సుబ్బారావు రమేశ్ కన్నా కొంచెం బలంగా ఉంటాడు. పైగా భూస్వాముల కుటుంబం నుండి వచ్చినవాడు కావడంతో కాస్త పొగరెక్కువ.  బలముంది కదా అని సుబ్బారావు ఈమధ్య రమేశ్‌ను ఊరికే ఎగతాళి చేస్తున్నాడు. పైగా అద్దెకూడా సరిగా కట్టట్లేదు. అన్ని పనులూ ఎగ్గొడుతుంటాడు.


సుబ్బారావు పద్దతి నచ్చక రమేశ్ కొన్నిరోజులుగా ఇల్లు మారుదామని చూస్తున్నాడు. నిజానికి ముందే సుబ్బారావు గురించి తెలిసిన రమేశ్ అతనితో రూంమేట్‌గా కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. అయితే వేరే రూమ్మేటు దొరక్క, ఒక్కడికే అద్దె మొత్తం కట్టే స్థోమత లేక సుబ్బారావే  వచ్చి రమేశ్ గదిలోచేరాడు.


మొదట అదే ఇంట్లో రమేశ్, రంగనాథ్ కలిసి ఉండేవారు. రంగనాథ్ ఉద్యోగం ట్రాన్స్‌ఫర్ అవడంతో గది ఖాలీచేసి వెల్లిపోయాడు. రంగనాథ్  వెల్లిపొయ్యాక రమేశ్ ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడ్డాడు. సుబ్బారావు వచ్చి తను జాయిన్ అవుతానని అడిగినా అతనిగురించి ముందే విని ఉన్నాడు కాబట్టి మొదట రమేశ్ ఒప్పుకోలేదు. అయితే సుబ్బారావు అనేక రకాలుగా హామీలిచ్చి ఒప్పించి మరీ వచ్చి చేరాడు. తీరా ఇప్పుడు ఇదీ వంతు. ఇక లాభం లేదనుకుని  తాను విడిగా ఉందామనుకుంటున్నాని రమేశ్ తన ఉద్దేషాన్ని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు అదీ రభస.


"అదేంటి సుబ్బారావ్ అలాగంటావ్? నాకిక్కడ ఇబ్బందిగా ఉందని చెబుతున్నాగా?"


"లేదు , నువ్విక్కడే ఉండి తీరాల్సిందే, లేకపోతే చూడు ఏం చేస్తానో!"


"ఏం చేస్తావేంది?"


"నీమీద వోనరుకు కంప్లైంటిస్తా!"


"సరే చేసుకో."


"అంతే కాదు, నా ఫ్రెండ్సుని తీసుకొచ్చి మన ఇంటిముందు ధర్నా చేస్తా, మీ ఆఫీసుకొచ్చి భైటాయిస్తా!"


"సరే. నీ ఇష్టం"


"ఇంకా నీ టీవీ పగుల గొడతా, నీ బైకును పెట్రోలు పోసి తగలబెడుతా".


"ఏంది సుబ్బారావ్? ఇంత చిన్న విషయానికి ఇలా ఫైరయిపోతావ్? నా బైకును తగలబెడితే నీకేమొస్తుంది? ఇష్టం లేకుండా ఇలా ఎందుకు కలిసి ఉండడం చెప్పు? నేనెల్లిపోతే నువ్వొక్కడివే నీ ఇష్టం ఉన్నట్టు హాయిగా ఉండొచ్చుగా? అడిగేవారెవరూ ఉండరు. ఒకవేళ అద్దె ఎక్కువనిపిస్తే ఇంకెవరినయినా తెచ్చుకో. ఈమాత్రానికి నా బైకును తగలబెడితే నీకేమొస్తుంది?"రమేశ్‌కి కోపం వచ్చింది.


సుబ్బారావు స్వరం పెంచాడు."నువ్వు నాకు లెక్చర్లిస్తావా? ఏమనుకున్నావ్ నేనంటే అసలు? మాఫామిలీ గురించి తెలుసా నీకు? నేను గానీ పిలిచానంటే మా ఊరినుంచి రేప్పొద్దుటిలోగా కత్తులేసుకుని వందమంది సుమోల్లో దిగుతారు!"


రమేశ్‌కు కాస్త భయమేసింది. సుబ్బారావు ఫామిలీ గురించి రమేశ్‌కు తెలుసు. సుబ్బారావు అన్నంత పనీ చేయగలడు మరి. వాళ్ళ ఊరిలో బాగా డబ్బూ, భూములూ ఉన్న జమీందారీ వంశం. సుబ్బారావు కుటుంబానికీ వాల్ల పక్క ఊరిలోని మరో కుటుంబానికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. వీల్ల గొడవల వల్ల ఆరెండూ ఊర్లమధ్య ఎప్పుడూ ముఠాతగాదాలవుతుంటాయి. చిన్న చిన్న విషయాలమీద పంతాలూ పగలకు పోయే ఈరెండు కుటుంబాలవల్ల ఇప్పుడా రెండు ఊర్లలో శాంతి లేకుండా పోయింది. 



రమేశ్ మెల్లిగా కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు.


"సుబ్బారావ్, ఇది నీకు తగదు. ఎంత చెడ్డా మనిద్దరం ఇన్నాల్లు కలిసి ఉన్నాం. ఇలా కొట్టుకోవడం ఎందుకు చెప్పు? నాకిష్టం లేకుండా ఎలా ఉండమంటావ్? అయినా నువ్వు సుమోల్లో మీఊరిజనాలను దించితే ఊర్కోడానికి ఇదేమన్నా మీఊరా? నేనెల్లి ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే నీ పని అయిపోద్ది. నేనెల్లినంత మాత్రాన నీకొచ్చే నష్టమేంటి అయినా నువ్వేనాడయినా నా ఇబ్బందులేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించావా?"


"నాకదంత తెల్వదు, నువ్వు విడిపోవడానికి వీల్లేదంతే. అసలిది దేశ సమగ్రతకే పరీక్ష."


"ఏందీ? మనం రూంమేట్లుగా ఉండక విడిపోతే  దేశ సమగ్రతకు ముప్పు వస్తుందా? ఏంది సుబ్బారావ్ ఈదారుణం? అసలు నీమాటల్లో కాస్తయినా అర్ధముందా?"


"నీకు తెలీదు. మందు మనం విడిపోతాం, అతరువాత మన ఓబులేసు, నారాయణ విడిపోతారు. ఆతరువాత శ్రీనివాసు, సింహాచలం విడిపోతారు. అలా ఒకరితరువాత ఒకరుగా అందరూ విడిపోతే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా?" రమేశ్‌ను ఈసారి  నిజంగానే ఇరికించానని లోలోపల తనతెలివికి తనే మురిసిపోతూ సుబ్బారావు తన వాదన చెప్పుకొచ్చాడు. 


తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఇలా సుబ్బారావు అర్ధం లేని వాదనలు చేయడం చూసి రమేశ్‌కు చిర్రెత్తింది. "ఇదిగో సుబ్బారావూ, నువ్వూ, నేను విడిపోతే ఈదేశానికి వచ్చే ముప్పేమీ లేదు గానీ నీకొచ్చే ముప్పేమిటో చెప్పు" రమేశ్ కోపంతో అరిచాడు.

  
నిజానికి రమేశ్ విడిపోతే సుబ్బారావుకు నష్టం ఏమీ లేదు. ఇంకో రూమ్మేటును వెతుక్కోవచ్చు, ఒంటరిగానూ ఉండొచ్చు. కానీ రమేశ్ ఉండడం వలన సుబ్బారావుకు చాలా కలిసొస్తుంది. ఎప్పుడూ ఇంట్లో పనులు రమేశే చక్కబెడతాడు, పైగా తను అప్పుడప్పుడూ అద్దె ఎగ్గొట్టినా నడుస్తుంది. ఇలా అదనంగా వచ్చే లాభాలు రమేశ్ విడిపోతే ఉండవు. కానీ ఆవిషయం ఒప్పుకోవడానికి సుబ్బారావుకు ఇష్టం లేదు.

ఈసారి ఇంకేం లాజిక్ వెతకాలా అని ఆలోచిస్తున్న సుబ్బారావుకు తనూ, రమేశ్ ఒకే కాలేజీలో చదివిన విషయం గుర్తొచ్చింది. "ఇదిగో.. ఇది మన కాలేజీ ఐక్యతకే దెబ్బ. నువ్వు వెల్లిపోవడానికి వీల్లేదు."


"చాల్చాల్లే సుబ్బారావ్" మనిద్దరం విడిపోతే మన కాలేజీ పరువుకొచ్చిన నష్టం ఏమీలేదు, నేను వచ్చే నెల వెల్లిపోతున్నాను. ఇక నీ ఇష్టం."  రమేశ్ ఆవేశంతో అక్కడున్నా బల్లపై గ్లాసు గుద్ది మరీ చెప్పాడు. ఆదెబ్బకి గ్లాసుకు కింద పెద్ద సొట్టపడింది.


"ఒరేయ్ రమేశ్, ఎంత ధైర్యంరా నీకు? నాగ్లాసుకు సొట్ట బెడుతావా? అసలు నువ్వు తాలిబన్‌వి." అంతకుముందురోజు ఎవరో తాలిబన్ అనే పదం వాడితే విన్న సుబ్బారావు అదేంటో తెలీకపోయినా మరీ అరిచాడు.


"ఛీ, వీడితో వాదన అనవసరం. వీడికి ఎదుటివారి హక్కులను గౌరవించడం చేతకాదు, సాటిమనుషుల ఆత్మగౌరవం వీడికి పట్టదు" అనుకుంటూ రమేశ్ గదినుంచి బయటికి వచ్చి బరువెక్కిన హృదయంతో రోడ్డుపై నడక సాగించాడు. ఇంతలో ఎదురుగా "మారాష్ట్రం మాకు కావాలి, జై తెలంగాణ!!" అని నినాదాలు చేస్తూ సాగుతున్న ఉద్యోగుల ర్యాలీ ఎదురురాగా తానూ ర్యాలీలో కలిసిపొయి వారి నినాదాలతో గొంతు కలిపాడు.

(on Wednesday, 10 October 2012)